బర్త్‌డేకు దుబాయ్‌ తీసుకెళ్లలేదని భర్తను గుద్ది చంపేసింది

26 Nov, 2023 06:12 IST|Sakshi

పుణె: తన పుట్టినరోజును పురస్కరించుకుని దుబాయ్‌కు తీసుకెళ్లి వేడుక చేయలేదనే వీరావేశంతో భర్తను భార్య పిడిగుద్దులు కురిపించి చంపేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పుణెకు చెందిన 38 ఏళ్ల నిఖిల్‌ ఖన్నా వాన్‌వాడియా ప్రాంతంలో వ్యాపారం చేస్తుండేవారు. అతనికి 36 ఏళ్ల భార్య రేణుక ఉంది.

ఆమె పుట్టినరోజు సెప్టెంబర్‌ 18. అదే రోజున తనను దుబాయ్‌కు తీసుకెళ్లి పుట్టినరోజు వేడుక జరపాలని పట్టుబట్టింది. అందుకు భర్త ససేమిరా అన్నాడు. ఈ నెల ఐదో తేదీన వీరి వివాహ వార్షికోత్సం జరిగింది. ఆ రోజూ తనకేమైనా ప్రత్యేక బహుమతులు ఇస్తాడేమో అని ఆశపడి భంగపడింది. ఢిల్లీలోని తన బంధువుల వేడుకలకూ వెళ్లాలని భావించినా అదీ నెరవేరలేదు.

ఒకదాని వెంట మరోటి ఏ ఒక్క ఆశ తీరకపోవడంతో నవంబర్‌ 24వ తేదీన భర్తతో వాగ్వాదానికి దిగింది. తీవ్ర వాదులాట సందర్భంగా వీరావేశంతో భర్త ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో ముక్కు నుంచి రక్తం కారుతూ అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భార్యభర్త ఘర్షణ పడుతున్న విషయం తెల్సి ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి భర్తను వెంటనే దగ్గర్లోని ససూన్‌ జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ఆయన ప్రాణం పోయిందని వైద్యులు ధృవీకరించారు.

మరిన్ని వార్తలు