వివాహిత ఆత్మహత్య.. తొడపై సూసైడ్‌ నోట్‌!

4 Feb, 2021 14:18 IST|Sakshi
భాగ్యశ్రీ ఉరివేసుకున్న పబ్లిక్‌ టాయిలెట్‌

ముంబై : భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పబ్లిక్‌ టాయిలెట్‌లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములంద్‌కు చెందిన భాగ్యశ్రీ నర్లే (29)కు సతారాకు చెందిన ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా ఆమె పుట్టింటికి వచ్చేసింది. గత కొన్ని నెలలుగా తండ్రితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త మెసేజ్‌ల‌ ద్వారా భాగ్యశ్రీని వేధించసాగాడు. ఆమెను ఆమె కుటుంబాన్ని చంపుతానని బెదిరించేవాడు. కుమారుడ్ని కూడా ఆమెతో ఉండటానికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. జనవరి 28వ తేదీన పబ్లిక్‌ టాయిలెట్‌లోకి వెళ్లి దుపట్టాతో అక్కడి పైపునకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ( అక్కకు అసభ్య సందేశాలు పంపిన తమ్ముడు)

బయటకు వెళ్లిన భాగ్యశ్రీ గంట దాటినా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకసాగారు. పబ్లిక్‌ టాయిలెట్‌ దగ్గర భాగ్యశ్రీని చూశామని ఎవరో చెప్పటంతో అక్కడికి వెళ్లారు. ఓ టాయిలెట్‌ లోపలినుంచి గడియపెట్టి ఉంది. తలుపు బద్ధలు కొట్టి చూడగా భాగ్యశ్రీ అక్కడి పైపునకు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె తొడపై సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. భార్య మరణానికి కారణమైన భర్తపై,అతడి కుటుంబంపై సంబంధిత సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు