NATO Summit: ప్రపంచానికి ప్రమాద ఘంటికలు.. ‘నాటో’ విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు!

5 Jul, 2022 08:29 IST|Sakshi

విశ్లేషణ

స్పెయిన్‌ రాజధాని మ్యాడ్రిడ్‌లో జూన్‌ 28 నుండి 30 వరకూ ‘నాటో’ సదస్సు జరిగింది. ఇందులో నాటో మిలిటరీ కూటమి విస్తరణౖకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు వెలువడ్డాయి. ఐరోపాలో నాటో సైనికుల సంఖ్యను పెంచడంతోపాటు, ఆ కూట మిని మొదటిసారిగా ఆసియా పసిఫిక్‌ ప్రాంత దేశా లలో విస్తరించే ప్రణాళికలు తయారైనాయి. ప్రస్తుతం యూరప్‌ లోనున్న 40 వేల సంసిద్ధతా దళాలను ఒకే సారి 3 లక్షల వరకూ పెంచుతామనీ, లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకులను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామనీ;

రష్యా, చైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి దిగుతామనీ నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్‌ బర్గ్‌ అన్నాడు. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్‌ హోదా కల్పిస్తా మనీ నాటో అంటోంది. నార్డిక్‌ తటస్థ దేశాలైన నార్వే, స్వీడన్‌లను తన పరిధిలోకి నాటో ఆహ్వానించటంతో దశాబ్దాల యూరప్‌ భద్రత ప్రశ్నార్థకమయింది.

‘‘ఈ దేశాల్లో మిలిటరీ మౌలిక సదుపాయాలతో నాటో స్థావరాలను మోహరిస్తే అందుకు దీటుగా మా ప్రతిస్పందన ఉంటుం’’దని పుతిన్‌ అన్నాడు. ఉక్రె యిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తూ, శాంతి చర్చలు కాదని యూరప్‌ కల్లోలానికి కారణమైన నాటో కూటమి యూరప్‌లో భారీగా మిలి టరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రతకు, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించటానికి ఆసియా పసిఫిక్‌ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి అన్నాడు.
చదవండి👉లుహాన్‌స్క్‌లో జెండా పాతేశాం: పుతిన్‌

చైనా సరిహద్దుల వరకు వెళ్ళటం తమ విధానాలలో వచ్చిన మార్పు అని చెప్పుకొచ్చాడు. రష్యాపై దాడి చేయటానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పాశ్చాత్య నాటో దేశాల కాల్బలంతో పాటు... ఆయా దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని స్టోల్టెన్‌బర్గ్‌ యుద్ధోన్మాదాన్ని బయటపెట్టాడు. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్‌ చాలాసార్లు చెప్పినా... ఆచరణలో ఉక్రెయిన్‌ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైని కులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్‌ను ఉక్రెయిన్‌కు నాటో పంపింది.

రష్యాకు చెందిన వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమ దేశాలు, 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకు రాగలిగాయి. అయితే ఉక్రెయిన్‌ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్‌ ప్రాంత మంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించడం గమనార్హం. 

రష్యా–ఉక్రెయిన్‌ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయటకు కనబడటానికి ప్రయత్ని స్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ప్రపంచం మొత్తంలో రెండంకెలు దాటిన ద్రవ్యోల్బణంతో పాటు రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగు తున్నాయి. అమెరికా, చైనా కూటములకు తటస్థంగా భారత్‌ ఉండి అలీనోద్యమ పూర్వ వైభవానికి కృషి చేస్తే... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణుల నుండి కాపాడుకొనే అవకాశాలుంటాయి. ఆంక్షల ఫలితంగా యూరప్‌ ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించ వచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది?
చదవండి👉ట్రంప్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు


వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్‌, కె.ఎల్‌. యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ‘ మొబైల్‌: 98494 91969

మరిన్ని వార్తలు