‘ఆడుదాం– ఆంధ్రా’ను సమన్వయంతో నిర్వహించాలి

15 Nov, 2023 00:54 IST|Sakshi
జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: గ్రామ సచివాలయం నుంచి రాష్ట్రస్థాయి వరకు డిసెంబర్‌ 15 నుంచి జనవరి 26 వరకు జరగనున్న ఆడుదాం– ఆంధ్రా కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ దీనిపై ఏ అవసరమొచ్చినా వెంటనే సంప్రదించాలన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, ఐకమత్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి మాట్లాడుతూ క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖో–ఖో మొత్తం ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. గ్రామ సచివాలయం స్థాయిలో పోటీలు వచ్చే నెల 15 నుంచి 20 వరకు, మండల స్థాయిలో వచ్చే నెల 21 నుంచి జనవరి 4 వరకు, నియోజకవర్గ స్థాయిలో జనవరి 5 నుంచి 10 వరకు, జిల్లా స్థాయిలో జనవరి 11 నుంచి 21 వరకు రాష్ట్ర స్థాయిలో జనవరి 22 నుంచి 25 వరకు నిర్వహించాలన్నారు. 44 రోజులపాటు నిరంతరం క్రీడా మహోత్సవం నిర్వహించాలన్నారు. వాలంటీర్లు ద్వారా ఈ నెల 20 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. పోటీలకు సంబంధించిన క్రీడా స్థలాలు, వసతి, మౌలిక సదుపాయాలు, అంపైర్లు, ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ బృందాలుగా ఏర్పడి ఏర్పాట్లు చేయాలన్నారు. బహుమతులు కూడా లక్షల రూపాయల్లో ఉంటాయని జేసీ వివరించారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, గుంటూరు ఆర్డీఓ పి.శ్రీకర్‌, స్టెప్‌ సీఈఓ పల్లవి, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ జి.వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాల్సిందే..

గుంటూరు వెస్ట్‌: ఐదు నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలందరూ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించాలని, ఆవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రాస్‌ ఎన్‌రోల్మెంట్‌ రేషియో (జీఈఆర్‌)ను ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి అధికారులు సమీక్షించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే జీఈఆర్‌ 95 శాతం పూర్తయిందన్నారు. నూరు శాతం పిల్లలందరూ పాఠశాలల్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డబుల్‌ ఆధార్‌ కార్డు ఉన్నవారి వివరాలు పూర్తి స్థాయిలో పరిశీలించి విద్యా శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడు చేయాలన్నారు.

మరిన్ని వార్తలు