పథకాలపై విస్తృత ప్రచారం జరగాలి

18 Nov, 2023 01:58 IST|Sakshi
మాట్లాడుతున్న కార్యదర్శి సోలమన్‌ ఆరోక్యరాజ్‌, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర నిర్వహిస్తు న్నామని కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సోలమన్‌ ఆరోక్యరాజ్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామ స్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమం జనవరి 26 వరకు నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమానికి నోడల్‌ అధికారిని నియమించాలనీ, కార్యక్రమ వివరాలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 60 రోజుల్లో 258 గ్రామాలు, మున్సిపాలిటీల్లో 20 రోజుల్లో 40 ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర నిర్వహించేలా రూట్‌ మ్యాప్‌ రూపొందించామన్నారు. జిల్లా స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించామని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులుగా 37 మందితోనూ, మండలస్థాయి అధికారులు 17 మందితో మండల కమిటీలు ఏర్పాటు చేసి కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ప్రాంతంలోనూ పాల్గొనేలా సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లు పాల్గొనేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, డీఆర్వో చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ జె.మోహన్‌రావు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, జీఎంసీ డిప్యూటీ కమిషనర్‌ వెంకట కృష్ణయ్య, అధికారులు పాల్గొన్నారు.

రబీలో పప్పు ధాన్యాల పంటలకు

ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు లేకపోవడంతో రబీలో సాగునీటి కొరత కొంత ఉంటుందని, దీనిని జిల్లా రైతాంగం గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్‌లో వీడియో సమావేశ మందిరంలో జిల్లా నీటి పారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి ప్రత్యేక సమావేశం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ రబీలో నీటి అవసరం తక్కువగా ఉండి, పప్పు ధాన్య రకాలైన మినుము, పెసర పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 26.13, పులిచింతల ప్రాజెక్టులో 10.29, శ్రీశైలం జలాశయంలో 10.20 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని తాగునీరు అవసరాలకు మాత్రమే వినియోగించనున్నామన్నారు. రబీలో నాగార్జున సాగర్‌ ఆయకట్టు, కృష్ణ వెస్ట్‌ డెల్టా ఆయకట్టుకు సాగునీరు సరఫరా జరగదని ఇరిగేషన్‌ అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు ప్రాంత రైతులు నీటి అవసరం లేని శనగ, మినుములు, కృష్ణా, వెస్ట్‌ డెల్టా ఆయకట్టు రైతులు మినుము, పెసర పంటలు సాగు చేయాలన్నారు. నీటి ఎద్దడి నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల స్థాయి, మండల స్థాయిలో వారం లోపు వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అధికారులకు అందించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఎం.శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఉమా మహేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర సంయుక్త కార్యదర్శి

సోలమన్‌ ఆరోక్యరాజ్‌

మరిన్ని వార్తలు