పేదరికం పై పైకి!

30 Aug, 2023 02:36 IST|Sakshi

దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 10 కోట్ల మంది

ప్రజల ఆదాయాలపై ప్రభావం చూపించిన కోవిడ్‌ మహమ్మారి

ఉద్యోగాలు పోయాయ్‌..ఆదాయం తగ్గింది..నివాస వసతీ కరువుదేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలోనే..

బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ.. కేరళ, పంజాబ్‌ వంటిచోట్ల తక్కువ

వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గిపోవడం పేదల సంఖ్యపెరిగేందుకు ఒక ప్రధాన కారణంగా

నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, ఉపాధి

అవకాశాలు తగ్గిపోవడం, ధరల

పెరుగుదల అవిద్య వంటివి కూడా

పేదరికం పెరిగేందుకు

దోహదపడినట్లు అంచనా.

యూకేను దెబ్బతీసిన కోవిడ్, యుద్ధాలు ప్రపంచదేశాలన్నింటి మాదిరిగానే యూకే కూడా కోవిడ్‌ వల్ల ఇబ్బందులు పడింది. ఇక అఫ్గానిస్తాన్‌ యుద్ధం, ప్రస్తుత రష్యా–ఉక్రెయిన్ల మధ్య నడుస్తున్న యుద్ధం వల్ల కూడా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగింది. ఫలితంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీని ప్రభావం యూకేపై కూడా పడింది.
– గారెత్‌ ఓవెన్, బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్, హైదరాబాద్‌

(కంచర్ల యాదగిరిరెడ్డి): కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని రకరకా లుగా మార్చేసిందనడంలో సందేహం లేదు! ప్రజల జీవనశైలి, ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోయాయి. కొందరికి కొత్త ఉద్యోగాలు వస్తే.. ఇంకొందరికి ఉన్నవి ఊడిపోయాయి. ఉద్యోగాలు ఉన్నా వేతనాలు తగ్గా యి. ముఖ్యంగా ప్రపంచం మొత్తమ్మీద పేదరికం పెరిగింది. ప్రపంచ బ్యాంకు మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరి ఎందుకు పేదరికం పెరిగింది? ఎలా పెరిగింది? ఎందరు పేదలుగా మారిపోయారు?

పేదరికం పెంచిన కోవిడ్‌
కోవిడ్‌ మహమ్మారి కారణంగా అనేక మంది ఆదాయాలు పడిపోయాయని, ఫలితంగా దేశంలో 10 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువకు చేరారని తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే పేదరికం పెరగడం అనేది కోవిడ్‌ వల్ల మాత్రమే జరిగిన పరిణామం కాదని, లెక్కలు తప్పడం వల్ల నిన్నమొన్నటివరకూ పేదల సంఖ్య స్పష్టంగా ప్రపంచానికి తెలియలేదని ప్రపంచ బ్యాంకు అంటోంది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన వ్యయాన్ని లెక్కవేయడంలో జరిగిన పొరపాట్ల కారణంగా పేదలు తక్కువగా ఉన్నట్లు కనిపించిందని, వాస్తవానికి వీరి సంఖ్య చాలా ఎక్కువని, గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా కోవిడ్‌ వచ్చిపడటంతో పేదరికం మరింత పెరిగిపోయిందని చెబుతోంది.

ఉద్యోగాలు, ఆదాయంపై ప్రభావం
కోవిడ్‌ మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోవడం తెలిసిందే. అయితే వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అంచనాల ప్రకారం ఇది కేవలం ఉద్యోగాలు కోల్పోవడానికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామందికి ఆదాయం తగ్గింది. మరికొంతమంది ఇళ్లూ కోల్పోయారు. ఫలితంగా పేదరికమూ పెరిగింది. పేదల్లోని దిగువ 40 శాతం మందికి 2021లో సగటు ఆదాయం 6.7 శాతం తగ్గిందని వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అధ్యయనం తేల్చింది.

అదే సమయంలో ధనికులైన 40 శాతం మందిలో ఈ తగ్గుదల కేవలం 2.8 శాతం మాత్రమే. కోవిడ్‌ దెబ్బ నుంచి కోలుకోలేకపోవడం పేదల ఆదాయం తగ్గేందుకు కారణమైంది. అయితే ధనికుల్లో సగం మంది తమ కష్టాల నుంచి బయటపడటం గమనార్హం. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిస్కల్‌ స్టడీస్‌ ప్రకారం యూకేలో కోవిడ్‌ దాదాపు ఏడు లక్షల మందిని పేదరికంలోకి నెట్టేసింది.

కోవిడ్‌కు ముందు జనాభాలో 15 శాతం మంది పేదరికంలో మగ్గుతుండగా.. తదనంతర పరిస్థితుల్లో ఇది 23 శాతానికి చేరుకోవడం గమనార్హం. అమెరికన్‌ సెన్సస్‌ బ్యూరో అంచనాల ప్రకారం 2021లో పేదరికంలో ఉన్న జనాభా 11.6 శాతం. అంటే సుమారు నలభై లక్షల మంది. అయితే కోవిడ్‌ ముట్టడించిన 2020తో పోలిస్తే ఇందులో పెద్దగా తేడా ఏమీ లేకపోవడం ఆసక్తికరమైన అంశం.

యూరప్‌ విషయానికి వస్తే, చాలా దేశాల్లో నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువైంది. యూరోపియన్‌ కమిషన్‌ ప్రాంతంలో సుమారు కోటీ ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు డిబేటింగ్‌ యూరప్‌ సంస్థ చెబుతోంది. ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ మూడొంతుల మంది వేతనాలు తగ్గాయి. దీంతో ఇక్కడ కూడా పేదరికం పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

అమెరికా లెక్క అలా.. మనది ఇలా
రోజుకు 1.90 డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారందరూ పేదలే అని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. కోవిడ్‌ కంటే ముందు ఇంతకంటే ఎక్కువ ఆదాయమున్న వారు కూడా మహమ్మారి కారణంగా పేదలుగా మారిపోయారని అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పేదరికంలో ఉన్న వారి మోతాదు 7.8 శాతం నుంచి 9.1 శాతానికి చేరుకుందని లెక్క గట్టింది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కూడు, గుడ్డ, నీడలకు కావాల్సినంత కూడా సంపాదించలేని వారే పేదలు.

ఈ కనీస అవసరాలు తీర్చుకునేందుకు సగటున 1.90 డాలర్ల వరకూ ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మన దేశంలో ఈ మూడింటితో పాటు ఆరోగ్యం, విద్య కూడా పొందలేని వారిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా వర్గీకరిస్తున్నాం. భారత్‌లో పేదరికాన్ని కొలిచేందుకు ‘టెండుల్కర్‌ మెథడాలజీ’ని ఉపయోగిస్తారు. దీని ప్రకారం మనిషి మనుగడ సాగిచేందుకు కావాల్సిన కనిష్ట మోతాదు కేలరీలకు అయ్యే ఖర్చుతో పాటు, దుస్తులు, నివసించేందుకు పెట్టే వ్యయాన్ని బట్టి పేదలా? కాదా? అన్న వర్గీకరణ జరుగుతుంది.

2021 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో 9.2 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. అయితే వీరి సంఖ్య అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేతీరున లేదు. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగానూ, కేరళ, పంజాబ్‌ వంటిచోట్ల తక్కువగానూ ఉంది. 2020లోనే పేదల సంఖ్య సుమారు ఏడు కోట్లకు చేరుకుందని రెండు, మూడేళ్లలోనే ఈ సంఖ్య తొమ్మిది కోట్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు అంచనాలు చెబతున్నాయి.

16.3 కోట్ల దిగువ మధ్యతరగతి?
రోజుకు 1.90 డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారు పేదలైతే..5.5 డాలర్లు సంపాదించేవారిని దిగువ మధ్య తరగతి వారిగా పరిగణిస్తున్నారు. ఈ వర్గీకరణలోకి వచ్చేవారు దేశం మొత్తమ్మీద 16.3 కోట్ల మంది ఉన్నారని ప్రపంచ బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి.

పేదరికంపై నడ్జ్‌ ఫౌండేషన్‌ పోరు
‘ద నడ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ 2015లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన లాభాపేక్ష లేని సంస్థ. పేదరిక నిర్మూలన మా లక్ష్యం. ప్రభుత్వం, పౌర సమాజం, కార్పొరేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్యాలు అందించేందుకు ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కృషి చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల కోసం గ్రామీణాభివృద్ధి కేంద్రం కూడా నడుపుతున్నాం.

వీరికోసం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు కర్ణాటక సహా ఎనిమిది రాష్ట్రాల్లో అమలవుతోంది. సమాజ సేవ చేయాలనుకునే సీఈవో, సీఓఓలకూ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారు 30 మంది సీఈవో, సీఓఓలు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తున్నారు. స్వయం సహాయక బృందాల్లోని సభ్యులకు వ్యక్తిగతంగా రుణాలిచ్చేందుకు, వడ్డీ సబ్సిడీలు కల్పించేందుకు ఆలోచన చేసి అమలు చేయడం వీరు సాధించిన విజయాల్లో ఒకటిగా చెప్పవచ్చు.– సుధా శ్రీనివాసన్, సీఈవో,ద నడ్జ్‌ ఫౌండేషన్‌

మరిన్ని వార్తలు