అతని పేరు చెప్పనందుకు సంతోషంగా ఉంది

8 Nov, 2020 16:33 IST|Sakshi

న్యూయార్క్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికపై గతంలో ఎప్పుడు లేని ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు శనివారం రాత్రి ఆ ఉత్కంఠకు తెరపడింది. డొమొక్రాట్‌ అభ్యర్థి జో బైడన్‌ 284 ఎలక్టోరల్‌ ఓట్లతో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నాడు. బైడెన్‌ ఎన్నిక కావడంపై ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి :  వైరల్‌ : ట్రంప్‌దే విజయం.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌)

ఈ కోవలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా ఉన్నారు. బైడెన్‌కు శుభాకాంక్షలు చెబుతూనే ట్రంప్‌ గెలుపు ఖాయమని ఒక జోతిష్యుడు చెప్పిన మాటలను మరోసారి ట్వీట్‌ చేశాడు. 'ఆ జోతిష్యుని పేరు బయటపెట్టనందుకు సంతోషంగా ఉంది. కానీ అతని ఉద్యోగానికి మాత్రం ప్రమాదం ఉండే అవకాశం ఉంది!'  అంటూ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్‌ మరోసారి వైరల్‌గా మారింది.(చదవండి : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్)‌

కాగా ఫలితాలు రాకముందు అమెరికా అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకున్నారు. అందులో ఒక జోతిష్యుడు కూడా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు ఖాయమని చెప్పాడు. అంతేగాక ట్రంప్‌ గెలుపును సూచిస్తూ ఏవేవో లెక్కలు వేసి దానిపై ట్రంప్‌ పేరును రాసి ఒక చార్ట్‌ను రూపొందించాడు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా ట్రంప్‌ గెలవడం ఖాయం అంటూ కుండబద్దలు కొట్టాడు ఆ జోతిష్యుడు. అయితే తాజాగా ట్రంప్‌ ఓటమితో జోతిష్యుడు పరిస్థితి ఏంటోనని నెటిజన్లు నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని వార్తలు