పిల్లల ఆరోగ్యంపై గ్యాస్‌ స్టవ్‌ల దుష్ర్పభావం.. షాకింగ్‌ విషయాలు వెల్లడి.. బైడెన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం?

10 Jan, 2023 20:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజారోగ్యం దృష్ట్యా గ్యాస్‌ స్టవ్‌ల వినియోగంపై బైడెన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్‌ స్టవ్‌ల నుంచి వెలువడే కాలుష్య కారకాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం వాటిపై నిషేధానికి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40 శాతానికిపైగా వీటిని వినియోగిస్తున్నారు. మిగతావారు విద్యుత్‌ పరికరాలు వాడుతున్నారు. 
(చదవండి: Video: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. 5 గంటలు శ్రమించి..)

గ్యాస్‌ స్టవ్‌లు వినియోగించినప్పుడు ప్రమాదకర నైట్రోజన్‌ డైఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, పార్టికల్స్‌ విడుదలవుతున్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్లను కలిగిస్తాయని తెలిపింది. చిన్నపిల్లల ఆస్తమా కేసుల్లో దాదాపు 12 శాతం గ్యాస్‌ స్టవ్‌ల వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. 

గ్యాస్‌ స్టవ్‌ను ఆఫ్‌ చేసినప్పటికీ వెలువడే మీథేన్‌ లీకేజీలు పర్యావరణానికి కీడు చేస్తాయని ఇప్పటివరకు పలు నివేదికలు వెల్లడించగా తాజాగా వాటి వినియోగం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలియడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాస్‌ స్టవ్‌ల వినియోగంపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
(చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన)

మరిన్ని వార్తలు