పట్టాభిషేకంలో ‘కోహినూర్‌ వజ్రం’ వినియోగంపై బ్రిటన్‌ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?

13 Oct, 2022 14:02 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్‌ ఎలిజబెత్‌ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్‌ కెమెల్లా పార్కర్‌ బౌల్స్‌, కింగ్‌ ఛార్లెస్‌ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్‌ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్‌ కామెల్లా.. కోహినూర్‌ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్‌ పేర్కొంది.

అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్‌ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్‌ ఎలిజబెత్‌ 2 మరణం, క్వీన్‌ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్‌ పై చర్చ జరిగి బ్రిటీష్‌ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్‌ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్‌ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు  వాదనలు వినిపిస్తున్నాయి. 

బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇదీ చదవండి: రాజుగా చార్లెస్‌ ప్రమాణం

మరిన్ని వార్తలు