ఆస్పత్రి నుంచి ట్రంప్‌ డిశ్చార్జ్‌.. మాస్కు తొలగించి..

6 Oct, 2020 08:41 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ బారిన పడి మిలటరీ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం శ్వేతసౌధానికి తిరిగి వచ్చారు. వాల్టర్‌ రీడ్‌ మెడికల్‌ హాస్పిటల్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వైట్‌హౌజ్‌కు చేరుకున్న ట్రంప్‌... ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌లో రిపోర్టకు అభివాదం చేస్తూ... థమ్సప్‌ సింబల్ చూపుతూ తాను బాగానే ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. అనంతరం మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజులిచ్చారు. కాగా డిశ్చార్జ్‌ కావడానికి ముందు అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ట్రంప్‌.. కారులో కలియదిరిగారు. తన అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌కు చికిత్స అందించిన ఆస్పత్రి డాక్టర్‌తో పాటు, ప్రతిపక్ష డెమొక్రాట్లు అధ్యక్షుడి తీరును ఆక్షేపించారు. అయితే తన కోసం ప్రార్థిస్తున్న అభిమానుల్లో ఉత్తేజం నింపేందుకే తాను ఇలా బయటకు వచ్చినట్లు ట్రంప్‌ పేర్కొనడం గమనార్హం.(చదవండి: ట్రంప్‌ ఆరోగ్యంపై ట్వీట్‌.. వెంటనే రీప్లేస్‌!)

ఇక గురువారం సాయంత్రం ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను మెరుగైన వైద్యం కోసం మిలటరీ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం ఆయన డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మరింత మెరుగుపడిందని, తదుపరి చికిత్స వైట్‌హౌజ్‌లో కొనసాగించవచ్చని డాక్లర్లు చెప్పారని శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి.

వెనుకబడ్డ ట్రంప్‌
ఇదిలా ఉండగా.. తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి, డెమొక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ పాపులారిటీ బాగానే పెరిగిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. అధ్యక్ష రేసులో దిగిన అనంతరం తొలిసారి ఆధిక్యం దిశగా సాగిన బైడెన్‌, ట్రంప్‌ కంటే 14 పర్సంటేజ్ పాయింట్లు సాధించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రెసిడెంట్‌ పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న ట్రంప్‌.. నవంబరు 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా, అనారోగ్యాన్ని పక్కనబెట్టి మరీ ప్రచారాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు. కరోనా తీవ్రతను తక్కువగా అంచనా వేసి ఆస్పత్రి పాలైన తనపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేతలకు దీటుగా సమాధానమిచ్చేందుకు కౌంటర్‌ అటాక్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు