101 ఏళ్ల తండ్రి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కుమారుడు.. 18 నెలలుగా ఆయనతో..

12 May, 2023 14:22 IST|Sakshi

అమ్‌స్టర్‌డ్యామ్‌: నెదర్లాండ్స్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని 18 నెలలుగా ఫ్రీజర్‌లో దాచాడు. అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఇతడు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇతను కూడా వృద్ధుడే కావడం గమనార్హం. వయసు 82 ఎళ్లు.

ఇన్ని నెలలుగా తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఎందుకు దాచావని పోలీసులు అతడ్ని ప్రశ్నించారు. అయితే తన తండ్రిని చాలా మిస్ అవుతానని, ఆయనతో మాట్లాడలేకుండా తాను ఉండలేని కుమారుడు బదులిచ్చాడు. అందుకే మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచి రోజు ఆయనతో మాట్లాడుతున్నానని, ఫలితంగా మరోధైర్యాన్ని పొందుతున్నానని తెలిపాడు.

అయితే తండ్రి ఎలా చనిపోయాడు అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన మృతికి సంబంధించి కుమారుడిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో ఫ్లాట్‌కు వచ్చి చెక్ చేసినట్లు వివరించారు. కాగా.. ఈయన తండ్రి చాలా ఏళ్లుగా ట్యూమర్‌తో బాధపడుతున్నాడని, తరచూ ఆస్పత్రికి కూడా వెళ్తారని పొరుగింటి వారు చెప్పారు.

మరోవైపు కుమారుడి వయసు కూడా 82 ఏళ్లు కావడంతో అతను సరిగ్గా నడవలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు. ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉందని, వస్తువులు కూడా సరిగ్గా సర్దుకోలేదని పేర్కొన్నారు. ముందు ఇల్లు సర్దుకోవాలని అతనికి వారం రోజులు గడువు ఇచ్చారు. అతను స్వతహాగా తన పనులు చేసుకునే స్థితిలో ఉన్నట్లు కూడా కన్పించడం లేదని, ఇతరుల సాయం కావాల్సి వస్తుందేమోనని పోలీసులు చెప్పారు. వారం రోజుల తర్వాత విచారణ కొనసాగిస్తామన్నారు.

కాగా.. నెదర్లాండ్స్‌లో 2015లో కూడా ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని రెండేళ్లపాటు ఫ్రిజ్లోనే దాచాడు. ఆమెకు వచ్చే పింఛను కోసం ఇలా చేశాడు. ఆ తర్వాత పోలీసులకు దొరకడంతో రూ.36 లక్షలు (40వేల యూరోలు) జరిమానా చెల్లించాడు.
చదవండి: నూరేళ్ల పంటలో.. ఎన్నో వింతలు.. పెళ్లిళ్లు జరిగినా లేటు వయసులోనే! 

మరిన్ని వార్తలు