మలాలా యూసఫ్‌జాయ్‌ రూ.2.5 కోట్ల విరాళం

19 Oct, 2023 06:15 IST|Sakshi

లండన్‌: గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణకాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్‌ సాహస బాలిక, నోబెల్‌ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్‌ చలించిపోయారు. ఈ మేరకు బుధవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. గాజాలోని అల్‌–అహ్లీ ఆసుపత్రిలో బాంబు పేలుడు ఘటనను మీడియాలో చూసి భయాందోళనకు గురయ్యానని చెప్పారు.

ఈ ఘాతుకాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, గాజాకు నిత్యావసరాలు, ఆహారం, నీరు సరఫరా చేయాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వాన్ని మలాలా కోరారు. ఈ విపత్కర సమయంలో గాజాలో పాలస్తీనియన్ల సంక్షేమం కోసం కృషి మూడు స్వచ్ఛంద సంస్థలకు 3 లక్షల డాలర్ల (రూ.2.5 కోట్లు) విరాళం ఇవ్వబోతున్నానని మలాలా ప్రకటించారు. ఇజ్రాయెల్, పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం పోరాడుతున్నవారితో తాను కూడా గొంతు కలుపుతున్నానని వ్యాఖ్యానించారు. గాజా జనాభాలో సగం మంది 18 ఏళ్లలోపు వారేనని అన్నారు.

మరిన్ని వార్తలు