మీడియా అత్యుత్సాహం.. హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు.. కొద్దిలో తప్పిన రోడ్డు ప్రమాదం 

18 May, 2023 10:07 IST|Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్‌ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్‌లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్‌ డయానాను పారిస్‌లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది.

ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్‌ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు.  ఘటన తర్వాత పోలీస్‌ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి.

అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్‌ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్‌లో బ్రిటన్‌ రాజుగా చార్లెస్‌ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి.
చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్‌ఆర్‌ఐ లహరి మృతి

మరిన్ని వార్తలు