Militant Group HAMAS History: ఇజ్రాయెల్‌లో హమాస్‌ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?

7 Oct, 2023 16:24 IST|Sakshi

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపు దాడులతో పదుల సంఖ్యలో సామాన్యపౌరులు మృతిచెందారు. వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ఇజ్రాయెల్‌ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

శనివారం ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి 5వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అటు పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు చొరబాటుకు దిగారు. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌ సైన్యం ప్రతిదాడికి దిగింది. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్‌లో యుద్ధ మేఘాలు అలుముకున్నట్లు సైన్యం ప్రకటించింది. తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్‌ ఘోర తప్పిదం చేసిందని, ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు.

మరోవైపు.. ఇజ్రాయెల్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రారంభించామని హమాస్‌ మిలిటరీ వింగ్‌ హెడ్‌ మొహమ్మద్‌ డెయిఫ్‌ ప్రకటించాడు. ఈ తెల్లవారుజామునే ‘ఆపరేషన్‌ ఆల్‌-అక్సా స్ట్రామ్‌’ ప్రారంభమైందని, ఇప్పటివరకు 5వేల రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్‌ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్‌పై గతంలో అనేకసార్లు దాడులు జరిగాయి. దీంతో కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న అతడు ఇప్పుడిలా వీడియో విడుదల చేయడం.. యుద్ధ తీవ్రతను అద్దం పడుతోంది.

హమాస్‌ ఏర్పాటు ఇలా.. 
హమాస్ ఒక మిలిటెంట్ ఉద్యమం. హమాస్, హరకత్ అల్-ముకావామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్) యొక్క సంక్షిప్త రూపం. ఇది గాజా స్ట్రిప్‌లో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లను పాలిస్తుంది. ఈ హమాస్‌ గ్రూప్‌ ఇజ్రాయెల్‌కు సాయుధ ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందింది. షేక్ అహ్మద్ యాసిన్ అనే పాలస్తీనా మత గురువు హమాస్‌ను స్థాపించాడు. డిసెంబర్ 1987లో గాజాలో హమాస్‌ను బ్రదర్‌హుడ్ రాజకీయ విభాగంగా యాసిన్ తయారు చేశారు. 

ఇ‍జ్రాయెల్‌ నాశనమే టార్గెట్‌..
ఆ సమయంలో హమాస్ యొక్క ఉద్దేశ్యం పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ (PIJ), ఇజ్రాయెల్‌ను హింసాత్మకంగా ప్రతిఘటించడమే లక్ష్యం. ఈ మేరకు 1988లో, హమాస్ తన చార్టర్‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిచ్చింది. PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యిట్జాక్ రాబిన్ ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి ఐదు నెలల ముందు ఏప్రిల్ 1993లో హమాస్ మొదటిసారిగా ఆత్మాహుతి బాంబు దాడిని ప్రారంభించింది. 

హమాస్‌కు ఎలా నిధులు సమకూరుతాయి?
డజన్ల కొద్దీ దేశాలు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నాయి. 1997లో అమెరికా హమాస్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హమాస్‌కు ఇరాన్ వస్తుపరంగా, ఆర్థికపరంగా సహాయాన్ని అందిస్తోంది. టర్కీ దాని అగ్ర నాయకులలో కొంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని పాలస్తీనా ప్రవాసులు మరియు ప్రైవేట్ దాతలు నిధులను అందిస్తున్నారు. అదనంగా, పశ్చిమ దేశాలలోని కొన్ని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు హమాస్ మద్దతు ఉన్న సామాజిక సేవా సమూహాలకు డబ్బును పంపిస్తున్నాయి. హమాస్ ద్వారా వందల మిలియన్ల డాలర్ల సహాయాన్ని అందించడానికి ఇజ్రాయెల్ ఖతార్‌​కు అనుమతిస్తోంది. ఇతర విదేశీ సహాయం సాధారణంగా PA మరియు UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటుంది.

2017 నుంచి దాడులు తీవ్రం..
ఇదిలా ఉండగా.. 2017 తర్వాత జెరూసలెంలో అత్యంత దారుణ హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. మిలిటెంట్లు ఇప్పటికే వందలాది రాకెట్లను జెరూసలెం, ఇజ్రాయెల్‌లోని మిగతా ప్రాంతాలపైకి ప్రయోగించారు. జెరూసలెం మీద మొదటిసారి రాకెట్లు ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు హద్దు మీరారు అంటూ అప్పట్లోనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చారు. 

శాంతి కోరుతున్న అంతర్జాతీయ సమాజం..
ఇజ్రాయెల్, పాలస్తీనాలు శాంతిని పునరుద్ధరించాలని ప్రపంచ దేశాలు విన్నవిస్తూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా వీలైనంత త్వరగా ఉద్రిక్తతలకు తెరదించాలని అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ కోరాయి. కానీ, దాడులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వందల మంది సామాన్యపౌరులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. 

మరిన్ని వార్తలు