మెట్రోలో అరణ్య రోదన

23 Nov, 2023 11:24 IST|Sakshi
మెట్రో రైలులో ప్రయాణికుల మధ్య యథేచ్ఛగా వేధింపులు (ఫైల్‌)

కర్ణాటక: సిలికాన్‌ సిటీలో నిత్యం ఏదో ఒకచోట అబలలపై వేధింపులు జరుగుతున్నాయి. మాల్స్‌, రోడ్డు, మెట్రో రైలు.. ఇలా ఎక్కడైనా భద్రత లేకుండా పోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనసందడితో ఉన్న మెట్రోలో యువతిని అసభ్యంగా తాకిన పోకిరీ వీడియో బయటకు వచ్చింది.

అంత రద్దీ ఉన్నా అడ్డుకోలేదు
సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో మెజిస్టిక్‌ మెట్రోలో ఘటన జరిగింది. బాధిత యువతి రోజూ మాదిరిగానే కాలేజీకి వెళ్లడానికి మెట్రో రైలులో ఎక్కింది. బోగీలో రద్దీగా ఉండగా, ఎర్ర చొక్కా ధరించిన ఓ వ్యక్తి వెనుక నుంచి ఆమెను తాకసాగాడు. ఇది గ్రహించిన యువతి సహాయం చేయాలని కోరితే తోటి ప్రయాణికులు ఎవరూ స్పందించలేదు. ఆమె ఏడ్చినా కూడా ఎవరిలో కనికరం కలగలేదు. యువతి స్నేహితులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఘాటుగా వ్యాఖ్యానం పెట్టారు. ఇది బుధవారం చర్చనీయాంశమైంది. సదరు దుండగున్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్‌ చేశారు.

ఫిర్యాదు రాలేదు: మెట్రో
మెట్రో అధికారి యశ్వంత్‌ చౌహాన్‌ దీనిపై స్పందించగా, ఏ టైం, ఏ ట్రైన్‌ అని తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, అయినా కూడా మేం చర్యలు తీసుకొంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు