శ్రీనివాసపురం: మెడికల్ షాపుల్లో అనుమతి లేని మత్తు మందులను విక్రయిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ నందకుమార్ తెలిపారు. ఆయన బుధవారం ముళబాగిలు పోలీస్ స్టేషన్లో మెడికల్ షాపు యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నగరంలో యువత మత్తు మందులకు బానిస కాకుండా నివారించడం కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. మెడికల్ షాపుల యజమానులు తమతో సహకరించాలని సూచించారు. నిషేధిత మందులను ఎట్టి పరిస్థితిలోను మందుల దుకాణాల్లో విక్రయించరాదన్నారు. ఎక్కడైనా ఇలాంటి మందులను విక్రయిస్తుంటే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అక్రమ లేఔట్పై నోటీసులు
కేజీఎఫ్: కేజీఎఫ్ నగరాభివృద్ధి ప్రాధికార వ్యాప్తిలోని సొరేగౌడన కోట గ్రామ సర్వేనెంబర్–14/5లో 0.39 ఎకరాల భూమిలో అనధికారికంగా లేఔట్ నిర్మించిన మునిమారెప్ప అనే వ్యక్తికి కేజీఎఫ్ నగరాభివృద్ధి ప్రాధికార కమిషనర్ ధర్మేంద్ర నోటీసులు జారీ చేశారు. లేఔట్లో నియమాలను పూర్తిగా ఉల్లంఘించారని, పార్కు కోసం స్థలం వదల లేదని, నిర్ణీత రోడ్డు విస్తీర్ణం లేదని, కాలనీకి విద్యుత్ కనెక్షన్ కల్పించలేదని, 30 మీటర్ల బఫర్ జోన్ కల్పించలేదని నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన 8 రోజుల్లోగా లేఔట్ను తొలగించి సరైన దాఖలాలతో మునిమారెప్ప మళ్లీ ప్రాధికారకు దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో ప్రాధికార చట్టాల ప్రకారం లేఔట్ను తొలగించి అందుకై న ఖర్చును భూ రెవిన్యూ బకాయి కింద వసూలు చేస్తామని తెలిపారు.