భర్తను వదిలేసి చాటింగ్‌ ప్రియుడితో వెళ్ళిపోయిన భార్య.. ఆ యువకుడిపై భర్త దాడి!

18 Dec, 2023 09:45 IST|Sakshi

ఉండవెల్లి: చాటింగ్‌లో పరిచయం పెంచుకుని, యువకుడితో ఓ వివాహిత భర్తను వదిలేసి వెళ్లిపోయింది. దీంతో వారు తిరిగి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త, మరో ఆరుగురు వారిని పట్టుకుని చితకబాదిన ఘటన పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ ఈరన్న తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌ జిల్లా కోవెలకుంట్లకు చెందిన ఇంద్రవతి, అయిజకు చెందిన హరీష్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి సంతానం లేదు. కాగా ఇంద్రవతికి ఆన్‌లైన్‌ చాటింగ్‌ ద్వారా కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హరిచరణ్‌తో పరిచయం పెరిగింది. పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరు ఈ నెల 13వ తేదీన హైదరాబాద్‌కు పరారయ్యారు. వీరు తిరిగి ఆదివారం కర్నూల్‌కు వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వివాహిత భర్త హరీష్‌, ఆరుగురు మిత్రులతో కలిసి పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వారి వాహనాన్ని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు.

ఘటనలో హరిచరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని వివాహితను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా, హరిచరణ్‌ను కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హరిచరణ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు