చిన్నచింతకుంట/ మహబూబ్నగర్ రూరల్: అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. జాతర ఉత్సవాలు నెలరోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జాతరకు ఆదివారం ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. మెట్లపై దీపాలు వెలిగించి గోవింద నామస్మరణ చేస్తూ.. కొబ్బరికాయ కొట్టి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొండ దిగువన మట్టికుండలో దాసంగాలు పెట్టి, గండదీపాలు మోసి మొక్కులు తీర్చకున్నారు. జాతర మైదానంలోని అంగళ్లలో వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేశారు. దీంతో ఎటు చూసినా జనం రద్దీగా కనిపించింది. భక్తులకు ఇబ్బ ందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్
కలెక్టర్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సువర్ణరాజు, ఆర్ఐ తిరుపతయ్య, ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డిల తదితరులున్నారు. అలాగే మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామిని కలెక్టర్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలికి ఆలయ విశిష్టతను చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్ వివరించారు. స్వామివారికి విశేష అర్చనలో కలెక్టర్ దంపతులు పాల్గొన్న తర్వాత శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వదించారు.