పటాన్చెరు టౌన్: మరో సైబర్ మోసం వెలుగుచూసింది. సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి ఏకంగా రూ.10లక్షలు కాజేశారు. ఈ సంఘటన అమీన్పూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అమీన్పూర్కు చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 6న నీకు సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయని, లక్నో కస్టమ్స్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నామని, నీకోసం ఢిల్లీ పోలీసులు వస్తున్నారని బెదిరించారు. ఆ తరువాత అపరిచిత వ్యక్తి బాధితునికి మెసేజ్ రూపంలో ఓ లింకు పంపి దాన్ని క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని చెప్పమన్నాడు. దీంతో బాధితుడు అపరిచిత వ్యక్తి చెప్పిన విధంగా లింకు ద్వారా వచ్చిన ఓటీపీని చెప్పగా అతని బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.పది లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు ముందుగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం అమీన్పూర్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ గడువు ముగుస్తుందని చెప్పి..
క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ గడువు ముగుస్తుందని వాటిని అప్డేట్ చేసుకోవాలని వచ్చిన మెసేజ్ కు స్పందించి బాధితులు రూ.లక్షా 20 వేలు పోగొట్టుకున్న ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక పీజేఆర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి అక్టోబర్ 9న తన ఫోన్కు రివార్డ్స్ సంబంధించిన మెసేజ్ వచ్చింది. బాధితుడు మెసేజ్ కు స్పందించి లింక్ క్లిక్ చేశాడు. దీంతో అతడి ఖాతాలో ఉన్న రూ.లక్షా 20 వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెలుగులోకి మరో సైబర్ మోసం
విద్రోహశక్తులతో సంబంధాలున్నాయంటూ బెదిరింపు
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు