జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా
మెదక్ కలెక్టరేట్: సాధారణ ఎన్నికల నేపథ్యంలో అత్యవసర సేవలందిస్తున్న 12 విభాగాల సిబ్బంది కోసం పోస్టల్ బ్యాలెట్లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఓటు వేసే అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్, అగ్నిమాపక, రవాణా, బీఎస్ఎన్ఎల్, రైల్వే, వైద్య, ఆర్ఓ, పీఓ, ఏపీఓ, పోలీస్, డ్రైవర్లు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, రెవెన్యూ, అత్యవసర శాఖల సిబ్బంది ఫారం–12(డి) పూర్తి చేసి తమ నియోజకవర్గాల అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుపడని వారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ (పీవీసీ) అందుబాటులో ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, డీఆర్ఓ పద్మశ్రీ, జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.