‘గాలి సంపత్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

27 Feb, 2021 13:35 IST|Sakshi

ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌ టైటిల్‌ రోల్‌లో, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్‌ తాజాగా.. మూవి ట్రైలర్‌ని విడుదల చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా పంచడం విశేషం.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. మాటలు రాని రాజేంద్ర ప్రసాద్‌కు హీరో కావాలని ఉంటుంది. కానీ ఆయన నిర్ణయం కొడుకు (శ్రీ విష్ణు)కు నచ్చదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘ప్రతి అమ్మాయికీ డ‌బ్బున్నోడే కావాలి.. లేక‌పోతే ఫారినోడు కావాలి.. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్‌తో హీరో చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్‌ని కూడా చూపించబోతున్నారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతంది.


చదవండి : 
‘పుష్ప’ అప్‌డేట్‌.. లీక్‌ చేసిన జానీ మాస్టర్‌

ఎన్టీఆర్ ధరించిన మాస్క్‌ ధరెంతో తెలుసా?

మరిన్ని వార్తలు