నాలుగు నెలల్లో పూర్తి

24 Dec, 2020 05:44 IST|Sakshi

‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ జోరు పెంచారు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’ సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. ఇంకా ఆయన కమిట్‌ అయిన చిత్రాల్లో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా, ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’ ఉన్నాయి. ‘రాధేశ్యామ్‌’ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. దీంతో కొత్త చిత్రాన్ని  జనవరిలో పట్టాలెక్కించనున్నారట ప్రభాస్‌. ‘సలార్‌’ చిత్రీకరణను జనవరి మూడో వారంలో ప్రారంభించనున్నారట. ఇప్పటికే ‘కేజీఎఫ్‌ 2’ సినిమా షూటింగ్‌ని పూర్తి చేసిన ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి కేవలం నాలుగు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారని టాక్‌. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా, వారిలో ఒక హీరోయిన్‌గా ‘లోఫర్‌’ బ్యూటీ దిశా పటానీని ఖరారు చేసినట్టు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు