కర్ణాటక ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారు.. ‘దేశంలో ముందస్తు ఎన్నికలు’

16 May, 2023 12:06 IST|Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : దేశంలో పార్లమెంట్‌ ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశం ఉందని.. పార్లమెంట్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కర్నాటక ప్రజలు తెలివితో బీజేపీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గద్దె దింపి బుద్ధి చెపుతారన్నారు. తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనీయబోమని, లౌకిక పార్టీలతో పొత్తు తప్పని సరిగా ఉంటుందని వచ్చే ఎన్నికల్లో కమ్యునిస్టులు అసెంబ్లీలో అడుగు పెడతారని ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణం కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతంరెడ్డి, రవినాయక్‌, వినోద్‌నాయక్‌, పాదూరి శశిధర్‌రెడ్డి, పోలెబోయిన వరలక్ష్మి, రామ్మూర్తి, మంగారెడ్డి, పరశురాములు, అంజాద్‌, అయ్యూబ్‌, రొండి శ్రీనివాస్‌, సైదులు, సత్యనారాణరావు, యాదగిరి, దయానంద్‌, పాపానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు