ఆలేరురూరల్ : ఆలేరు పట్టణ కేంద్రంలోని బీసీ కాలనీలో సోమవారం తెల్ల వారుజామున దొంగలు హల్చల్ చేశారు. వేకువజామున 3:15 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు కాలనీ వీధుల్లోకి వచ్చారు. ఎం.పరుశరాములు అనే వ్యక్తి బైక్ను అపహరించుకుపోయారు. మరో ఇద్దరి బైక్లను చోరీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదంతా కూడా సీసీ కెమరాల్లో రికార్డు అయ్యింది.బాధితుడు పరుషరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశ్రీను చెప్పారు.
రాజ్యాంగ పుస్తకాన్ని ఉచితంగా అందించాలి
భానుపురి(సూర్యాపేట): ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా ప్రభుత్వమే అవగాహన కల్పించాలన్నారు. ప్రజలందరికీ రాజ్యాంగంపై అవగాహన లేకపోవడంతో ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను పసికట్ట లేకపోతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగంతోనే పేద ప్రజలకు హక్కులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బాలు, నరేష్, శ్రీనివాస్, జమదగ్ని, సైదా బాబు, అశోక్, విజయరామరాజు, రమేష్, సైదులు, శ్రీకాంత్, శేఖర్, నాగరాజు, స్టాలిన్, నాగార్జున, మస్తాన్, సురేష్, ప్రవీణ్, అంబేద్కర్, అమర్నాథ్, సైదులు, వినీత్, సాయిరాం, మహేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.