భర్త వేధింపులు తాళలేక వివాహిత తీవ్ర నిర్ణయం!

5 Dec, 2023 09:34 IST|Sakshi

నల్లబెల్లి(వరంగల్‌): భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని రాంపూర్‌ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ నైనాల నగేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని చిన్ననెమలి గ్రామ పంచాయతీకి చెందిన సూరినేని లక్ష్మి–సోమేశ్వర్‌రావు దంపతుల కుమార్తె మౌనిక(30), వరంగల్‌ నల్లబెల్లి మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ పురం సారంగపాణి 14 ఏళ్ల క్రితం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు.

కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కాగా, ఇటీవల సారంగపాణి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను తరుచూ వేధిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సారంగపాణిని మందలించారు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోమారు భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

>
మరిన్ని వార్తలు