రెండు బైక్‌లు ఢీ.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

5 Dec, 2023 09:54 IST|Sakshi
విక్రం (ఫైల్‌)

చౌటుప్పల్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్‌ మండల పరిధిలోని పంతంగి గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన మస్కు విక్రం(20) చౌటుప్పల్‌లోని ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు.

తన గ్రామానికే చెందిన మరో యువకుడు రమేష్‌తో కలిసి నిత్యం స్టూడియోకు వస్తుంటారు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి పని ముగించుకున్నాక ఇద్దరు యువకులు కలిసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పంతంగి గ్రామ శివారులోని పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన స్కూటీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డుపై పడ్డారు.

బైక్‌ నడుపుతున్న విక్రం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సీఐ ఎస్‌. దేవేందర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు