మీరిప్పుడున్నది సముచిత స్థానం కానీ..

7 Aug, 2023 05:51 IST|Sakshi
కార్యక్రమంలో అమిత్‌షా, అజిత్‌ పవార్‌

అజిత్‌ పవార్‌పై అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు

పుణే: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు ఆదివారం పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మీరిప్పుడు సరైన స్థానంలో ఉన్నారు. కానీ, చాలా ఆలస్యమైంది’అని పేర్కొన్నారు. ‘అజిత్‌ పవార్‌తో కలిసి నేను పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమమిది. ఈ సందర్భంగా ఆయనకు ఒక విషయం చెప్పదల్చుకున్నా.

చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు సముచిత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఎప్పుడూ ఇదే స్థానంలోనే ఉండటం సబబు. కానీ, ఈ స్థానంలోకి ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ కూడా పాల్గొన్నారు. నెల క్రితం ఎన్‌సీపీనీ చీల్చిన అజిత్‌ పవార్, ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు ఆయన వర్గానికి మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు