రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు

19 Nov, 2022 22:54 IST|Sakshi

మంగళూరు: రహదారిపై ఒక్కసారిగా ఆటో రిక్షా పేలిపోయింది. దట్టమైన పొగ కమ్ముకోవటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం మధ్యాహ్నం జరిగింది. ఈ పేలుడులో ఆటో డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు మంగళూరు పోలీస్‌ చీఫ్‌ ఎన్‌ శశికుమార్‌ తెలిపారు. 

‘ప్రమాదానికి గల కారణాలను అంచనా వేయటం తొందరపాటు అవుతుంది. ఆటోలో మంటలు వచ్చినట్లు డ్రైవర్‌ తెలిపాడు. డ్రైవర్‌, ప్రయాణికుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రూమర్స్‌ వ్యాప్తి చేయకూడదని ప్రజలను కోరుతున్నాం. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. బాధితులతో మాట్లాడిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం.’ ఎని తెలిపారు శశికుమార్‌. 

రోడ్డుపై ఆటో రిక్షా పేలిపోయిన సంఘటన స్థానికంగా ఉండే ఓ దుకాణం సీసీటీవీ కెమెరాలో నమోదైంది. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ అలుముకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మరోవైపు.. ఆటోలోని ప్రయాణికుడు ప్లాస్టిక్‌ బ్యాగ్‌ తీసుకెళ్తున్నాడని, ముందుగా దానికి మంటలు అంటుకుని వ్యాపించాయని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నెల ఆగితే పండంటి బిడ్డకు జన్మనిచ్చేది.. ఇంతలోనే ఘోర ప్రమాదం..

మరిన్ని వార్తలు