వ్యాక్సిన్లపై రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

31 May, 2021 16:32 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్ల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు

యోగా, ఆయుర్వేదమే నాకు రక్ష: యోగా గురు రాందేవ్‌

ఆయుర్వేదానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర

రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి గుర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్‌ బాబా మరోసారి  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.  తాను టీకా తీసుకోలేదని,  సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. ఈ సందర్భంగావ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై  తన దాడిని మరింత తీవ్రం  చేశారు.  తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వెయ్యికోట్ల  రూపాయల పరువు నష్టం దావా  హెచ్చరిక అనంతరం రాందేవ్‌  తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నాను, కాబట్టి తనకు టీకా అవసరం లేదని రాందేవ్‌ వాదించారు. భారతదేశంతో పాటు విదేశాలలో 100 కోట్లకు పైగా ప్రజలు ఈ పురాతన చికిత్స ద్వారా లబ్ది పొందుతున్నారనీ, రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని ఆయన పేర్కొన్నారు. కాగా వ్యాక్సినేషన్‌  ఉత్తరాఖండ్‌ ‌డివిజన్‌ ‌ఐఎంఏ పరువు నష్టం నోటీసును పంపించిన సంగతి తెలిసిందే.  "స్టుపిడ్ సైన్స్"  అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేసింది.

15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పక పోతే, రూ.1,000 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు  ప్రధాని నరేంద్ర మోదీకి ఇండియన్‌ ‌మెడికల్‌ అసోసియేషన్‌ ‌లేఖ రాసింది. వ్యాక్సినేషన్‌ ‌విషయంలో ఆయన చేస్తున్న తప్పుడు వ్యాఖ్యాలను నిలువరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దోశద్రోహ చట్టం ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేసింది.  రెండు డోసుల వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం వల్ల 10 వేల మంది డాక్టర్లు చనిపోగా, లక్షల మంది ప్రజలు అల్లోపతి వైద్యం వల్ల మరణించారన్న రాందేవ్‌ ‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అలాగే ఈ విషయంలో రాందేవ్‌ వాదనలకు సమాధానం ఇవ్వడానికి తాము సిద్ధమని ఉత్తరాఖండ్  ‌ఐఎంఏ  ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ ఖన్నా ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి: కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు
వ్యాక్సిన్: మందుబాబులకు పరేషాన్‌!
కరోనా: మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన డా.రెడ్డీస్‌

మరిన్ని వార్తలు