Karnam Malleswari: ఇది ఒక వరం లాంటింది

24 Jun, 2021 05:27 IST|Sakshi

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం

ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ వీసీ కరణం మల్లీశ్వరి

క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసం కల్పిస్తాం..

సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్‌ చాన్సలర్‌(ప్రకటిత) కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడలకు కావాల్సిన వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సులభమేనన్నారు. ఢిల్లీ క్రీడా వర్సిటీ వీసీగా నియమితులైన క్రమంలో బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే.. యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. 

ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ  వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి.

క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్ని కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటింది.  త్వరలోనే బాధ్యతలు చేపడతా. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని కరణం మల్లీశ్వరి వివరించారు. 

చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్‌ వర్సిటీ మొదటి వీసీగా కరణం మల్లీశ్వరి

మరిన్ని వార్తలు