అస్సాం సీఎం శర్మకు ఈసీ నోటీసు

27 Oct, 2023 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారం సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో హిమాంత శర్మ మాట్లాడుతూ..‘ఒక చోటికి ఒక అక్బర్‌ వచ్చాడంటే అతడు మరో 100 మంది అక్బర్‌లను పిలుస్తాడు.

అందుకే సాధ్యమైనంత త్వరగా అక్బర్‌ను పంపించివేయాలి. అలా చేయలేకపోతే కౌశల్య మాత పుట్టిన ఈ నేల అపవిత్రమవుతుంది’ అంటూ రాష్ట్ర కేబినెట్‌లోని ఏకైక ముస్లిం మంత్రి మహ్మద్‌ అక్బర్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తమకు సమాధానమివ్వాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు