Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం

4 Dec, 2023 05:37 IST|Sakshi

కేవలం 3 రాష్ట్రాల్లో సొంతంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు  

న్యూఢిల్లీ:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి.

ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది.

ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్‌ ప్రభుత్వాల్లో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్‌ ఆద్మీ పారీ్ట(ఆప్‌) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్‌’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్‌ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. 

>
మరిన్ని వార్తలు