శ్మశానానికి స్వాగతం ఫ్లెక్సీలు, ప్రధాని, సీఎం పరువు తీసేశారు!

5 May, 2021 12:57 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కోవిడ్‌ పేరుతో ప్రచారం పొందాలని ప్రయత్నించిన బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్న సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. కోవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడే పబ్లిసిటీ పిచ్చితో నాయకులు ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో సోమవారం ఫ్లెక్సీ తయారు చేయించి శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు.

విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో నెలమంగల బీజేపీ నాయకులకు క్లాస్‌ తీసుకున్నారు. దీంతో సాయంత్రం సమయానికి ఫ్లెక్స్‌ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు