-

గ్రీస్‌ సమీపంలో సరకు నౌక మునక

27 Nov, 2023 04:45 IST|Sakshi

నలుగురు భారతీయులు గల్లంతు

ఏథెన్స్‌: గ్రీస్‌ పరిధిలోని లెస్బోస్‌ ద్వీపం సమీప మధ్యదరా సముద్ర జలాల్లో ఒక సరకు రవాణా నౌక మునిగిన ఘటనలో నలుగురు భారతీయుల ఆచూకీ గల్లంతైంది. సిబ్బందిలో ఒక్కరిని మాత్రమే కాపాడగలిగామని గ్రీస్‌ తీర గస్తీ దళాలు వెల్లడించాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో గాలింపు కష్టంగా మారింది. దాదాపు 6,000 టన్నుల  ఉప్పుతో ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియా నుంచి బయల్దేరిన నౌక తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో గ్రీస్‌కు చెందిన లెస్బోస్‌ వద్ద మునిగిపోయింది.

నౌకలోని 14 మంది సిబ్బందిలో నలుగురు భారతీయలు, ఎనిమిది మంది ఈజిప్ట్‌పౌరులు, ఇద్దరు సిరియన్లు ఉన్నారు. ఆదివారం ఉదయం ఏడింటపుడు మెకానికల్‌ సమస్య తలెత్తిందంటూ ఎమర్జెన్సీ సిగ్నల్‌ పంపిన నౌక తర్వాత కనిపించకుండా పోయింది. ఒక ఈజిప్ట్‌ పౌరుడిని మాత్రం రక్షించగలిగారు. ఎనిమిది వాణిజ్య నౌకలు, రెండు హెలికాప్టర్లు, ఒక గ్రీస్‌ నావికా యుద్ద నౌక గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ఘటన జరిగన చోట్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

మరిన్ని వార్తలు