వచ్చే నెలలో ఢిల్లీలో జీ20 పార్లమెంట్‌ స్పీకర్ల భేటీ

2 Sep, 2023 05:58 IST|Sakshi

న్యూఢిల్లీ: జీ20 కూటమి దేశాల పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్‌ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్‌ నూతన భవనం పార్లమెంట్‌–20 భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్‌ సెక్రటరీ ముక్తేశ్‌ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు. ‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్‌ వివరించారు. భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్‌ భేటీలు జరుగుతున్నాయని, ఆ క్రమంలో ఇది 9వదని వివరించారు.

మరిన్ని వార్తలు