ఈ సారి విమానం కాదు ట్రైన్‌.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన టీటీఈ!

14 Mar, 2023 15:47 IST|Sakshi

లక్నో: ఇటీవల విమానాల్లో ప్రయాణికులు తోటి వారితో లేదా అందులోని సిబ్బందితో అనుచిత ప్రవర్తిస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ ఘటనల్లో కొందరు కటకటాల పాలయ్యారు కూడా. అయినా వీటికి ఫుల్‌ స్టాప్‌ మాత్రం పడేలా కనిపించడం లేదు. తాజాగా ఈ తరహా ఘటనే ఓ రైల్లో వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో నిందితుడు ఓ రైల్వే అధికారి కావడం గమనార్హం. ఆ వ్యక్తి చేసిన పనికి చివరికి కటకటాలపాలయ్యాడు. అక్కడ ఏం జరిగిందంటే...

మద్యం మత్తులో టీటీఈ...
ఓ మహిళ తన భర్తతో కలిసి అమృత్‌సర్‌- కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులతో పాటు ఆ జంట కూడా నిద్రలోకి జారుకుంది. ఇంతలో మద్యం మత్తులో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆ మహిళపై మూత్రవిసర్జన చేశాడు. మహిళ నిద్రలేచి అరవడంతో ఆమె భర్త టీటీఈని పట్టుకోగలిగాడు.  మహిళ అరుపులు విని  ఇతర ప్రయాణీకులు కూడా మేల్కొని టీటీఈని కొట్టారు.  తర్వాత స్టేషన్‌ రాగానే టీటీఈని ప్రభుత్వ రైల్వే పోలీసులకు (GRP) అప్పగించారు. నిందితుడిని బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌గా గుర్తించారు. ఈ మేరకు టీటీఈపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో..
కొన్ని నెలల క్రితం విమానంలో ఇదే తరహాలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. అనంతరం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుడు శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించకుండా 4 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రయాణిస్తున్న సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత ఐజీఐ విమానాశ్రయంలో ప్రయాణికుడిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు