క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు

14 Mar, 2023 15:49 IST|Sakshi

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఇటీవల యూకే పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం జరిగిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశం సైతం రసాభాసగ మారి ఉభయ సభల్లో ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే వాయిదాపడ్డాయి. అదే రగడ రెండో రోజు కూడా కొనసాగింది. లండన్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్ద ఎత్తున నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ దాడిని పెంచుతూ..కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ ఒక సభ్యుడు విదేశాలకు వెళ్లి భారత ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే పార్లమెంట్‌ చూస్తూ కూర్చొదన్నారు.

గాంధీ క్షమాపణ చెప్పాల్సిందే, అన్ని పార్టీల ఎంపీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాల్సిందే అని డిమాండ్‌ చేసింది బీజేపీ. ఐతే కాంగ్రెస్‌ పార్టీ అధికార పార్టీ చేసిన ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. పైగా ప్రజాస్వామ్యన్ని అణిచివేసేవారే రక్షించడం కోసం మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్‌ నాయకులు. దీంతో ఇరు పార్టీ మధ్య వాగ్వాదం సద్దుమణగకపోగా తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. రెండో రోజు కూడా లోక్‌సభ​, రాజ్యసభలు సమావేశమైన వెంటనే వాయిదాపడ్డాయి.

ఈమేరకు మరో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గురించి ప్రస్తావించారు. వారంతా మైనారిటీల దాడులు గురించి చెబుతున్నారు గానీ నాడు వేలాదిమంది సిక్కులు హత్యకు గురైనప్పుడు ఆ ఘటనలకు బాధ్యులైన వారిని సోనియా, రాజీవ్‌గాందీలు రక్షించారంటూ ఆరోపణలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్‌కు చెందిన శక్తిసిన్హ గోహిల్‌ పీయూష్‌ గోయల్‌పై ప్రివలేజ్‌ ఉల్లంఘన నోటీసులు దాఖలు చేశారు. ఆ నోటీసుల్లో వాస్తవాలు తెలుసుకోకుండా గోయల్‌ లోక్‌సభ సభ్యుడిని ఉద్దేశపూర్వకంగానే విమర్శించారని పేర్కొన్నారు గోహిల్‌.

అలాగే ఏ సభ్యుడు మరో సభలోని సభ్యునిపై ఆరోపణలు చేయరాదనే చైర్‌ నిబంధనను గుర్తు చేశారు. అంతేగాదు తాము ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ గడ్డపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఎప్పుడూ లేవనెత్తలేదని కూడా అన్నారు. అయినా రాహుల్‌ క్షమాపణ చేప్పే ప్రశ్నే లేదని లోక్‌సభలోని కాంగ్రెస్‌ ఉపనేత మాణికం ఠాగూర్‌ అన్నారు. అసలు ఆ ప్రశ్నకు తావేలేదు ఎందుకంటే రాహుల్‌ కరెక్ట్‌గానే చెప్పారు. అయినా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు క్షమాపణ చెప్పనప్పుడూ కాంగ్రెస్‌కు చెందినవారు మాత్రం ఎందుకు చెప్పాలి అని నిలదీశారు. ఈ మేరకు ఠాగూర్‌ విదేశాల్లో ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలను సైతం ట్విట్టర్‌లో ఉంచారు. మోదీ విదేశాల్లో భారత్‌ని అవమానించారు కాబట్టి ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లేదంటే సావర్కర్‌ లాగా చేయగలరు అని మాణిగం ఠాగూర్‌ అన్నారు. 

(చదవండి: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ)

మరిన్ని వార్తలు