సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వేలాది ఏళ్ల క్రితమే మన రుషులు ప్రపంచానికి యోగాను అందించారు. లక్షలాది మందికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం, శరీరం, మనస్సు ఐక్యత సాధనం యోగా. ఇది మానవాళికి భారతదేశం ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి. కరోనా వైరస్పై పోరులో కూడా యోగా ఎంతో సహాయపడుతుంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
దైనందిన జీవితంలో యోగాభ్యాసం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ ఏడాది ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని ఆయన కోరారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు