కశ్మీర్‌కు రాష్ట్ర హోదానే ఎజెండా

5 Sep, 2022 05:12 IST|Sakshi

గులాం నబీ ఆజాద్‌ వెల్లడి

జమ్మూలో మొదటి ర్యాలీ

జమ్మూ: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా తమ కొత్త పార్టీ ఎజెండాలో ప్రధానంగా ఉంటుందని సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని అన్ని వర్గాలను కలుపుకుని పోతామని తెలిపారు. కాంగ్రెస్‌కు ఆయన ఇటీవల రాజీనామా చేయడం తెలిసిందే. జమ్మూ శివారులోని సైనిక్‌ కాలనీలో ఆదివారం మొట్టమొదటి ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కశ్మీరీ పండిట్లకు పునరావాసం, నివాసితులకు భూ, ఉద్యోగ హక్కుల కల్పన వంటివి కూడా తమ ఎజెండాలో ఉంటాయన్నారు.

కొత్త పార్టీ పేరు, జెండా వంటి వాటిని ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. ఉగ్రవాదుల టార్గెట్‌ కిల్లింగ్స్‌పై ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాటిని ఇకపై ఆపేయాలన్నారు. లోయకు తిరిగి రావాలనుకునే వారికి భద్రత, వసతులు కల్పిస్తామని చెప్పారు. ఆజాద్‌కు మద్దతుగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆప్ని పార్టీ, పీడీపీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు