భారీ భద్రత నడుమ కోర్టు కాంప్లెక్స్‌లోనే లాయర్ దారుణ హత్య..

30 Aug, 2023 19:42 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో దారుణం జరిగింది. కోర్టు కాంప్లెక్స్‌లో తన ఛాంబర్‌లో ఉన్న మోను చౌదరి అనే లాయర్‌ని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. న్యాయవాది తన సన్నిహితులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది. కోర్టులో సెక్యూరిటీ కళ్లుగప్పి దుండగులు ఎలా ప్రవేశించారనేది మిస్టరీగా మారింది. 

మధ్యాహ్నం 2 గంటల సమయంలో లాయర్లు తమ ఛాంబర్లలోకి వెళ్లి భోజనాలు చేస్తున్నారు. లాయర్ మోను చౌదరి కూడా తన సన్నిహితులతో కలిసి భోజనం చేస్తుండగా.. దుండగులు అకస్మాత్తుగా తన ఛాంబర్‌లోకి ప్రవేశించి గన్‌లతో కిరాతకంగా కాల్చి చంపారు. న్యాయవాది రక్తపు మడుగులు పడి ఉండగా.. దుండగులు తప్పించుకుని పారిపోయారు. ఆయితే.. పోలీసులకు న్యాయవాదులకు మధ్య జరుగుతున్న హాపూర్ లాయర్ల ఆందోళన తర్వాత ఈ ఘటన జరగడం పోలీసులపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కోర్టులో సెక్యూరిటీని దాటుకుని దుండగులు పిస్టళ్లతో ఎలా ప్రవేశించగలిగారనేది మిస్టరీగా మిగిలింది. సెక్యూరిటీ కెమెరాలు ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం వివాదాస్పదంగా మారింది. లాయర్ మోను చౌదరి హత్యపై లాయర్ల సంఘాలు భగ్గుమన్నాయి. న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

హాపూర్ లాయర్ల ఆందోళన..
ఓ లాయర్, అతని తండ్రిపై తప్పుడు కేసు పెట్టినందుకు న్యాయవాదుల సంఘాలు నిరసనలు చేపట్టాయి. ఈ ఆందోళనలను అదుపుచేయడానికి పోలీసులు.. లాయర్లపై లాఠీఛార్జీ చేశారు. దీంతో న్యాయవాదులపై పోలీసుల చర్యలు హక్కులను భంగపరచడమేనని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. శాంతియుత నిరసనలు చేపట్టిన లాయర్లపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని తప్పబట్టింది. 

ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్‌ మేనేజర్‌ దారుణ హత్య..


 

మరిన్ని వార్తలు