అప్పటి వరకు ఎంజాయ్‌ చేసి ఒక్కసారిగా కుప్పకూలి.. వీడియో వైరల్‌

3 Oct, 2022 18:38 IST|Sakshi

మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఇప్పటికే ఎన్నో ఘటనల్లో చూసే ఉంటాము. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి క్షణకాలంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్‌లు చేస్తూ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా, వేడుకల్లో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఆనంద్‌ జిల్లాలోని తారాపూర్‌లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఇంతలో.. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్‌(21) అందరితో కలిసి గర్బా డ్యాన్స్‌ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్యాన్స్‌ చేస్తూ ముందుకు వచ్చి కింద కుప్పుకూలిపోయాడు. దీంతో, అక్కడున్న వారంతా సడెన్‌గా ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు అతడిని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, పండుగ పూట వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. 

మరిన్ని వార్తలు