పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడై తిరిగొచ్చాడు.. 

10 Feb, 2021 02:00 IST|Sakshi
కోటి తెచ్చిన లాటరీ టికెట్‌తో బలరామ్‌ కుటుంబం

కర్ణాటకవాసికి కేరళలో బంపర్‌ లాటరీ  

సాక్షి, మండ్య: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. మామూలు మనిషి కాస్తా కోటీశ్వరుడు కావచ్చు. నిజంగా అలాగే జరిగింది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్‌ బలరామ్‌ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్‌ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో  కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్‌.

తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్‌ మొబైల్‌కు ఫోన్‌ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్‌ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్‌ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్‌ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్‌ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్‌మిల్‌ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు