డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం

25 Aug, 2021 17:16 IST|Sakshi

న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీలో 300 ఏవో ఉద్యోగాలు

గ్రాడ్యుయేట్లకు చక్కటి అవకాశం 

భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ.. ద న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌... 300 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(ఏఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.60వేల వేతనం అందుకోవచ్చు!!

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌ 

మొత్తం పోస్టుల సంఖ్య: 300(అన్‌ రిజర్వ్‌డ్‌–121, ఓబీసీ–81, ఎస్సీ–46, ఎస్టీ–22, ఈడబ్ల్యూఎస్‌–30, పీడబ్ల్యూబీడీ–17)

వేతనం: ఎంపికై ఉద్యోగంలో చేరిన వారికి వేతన శ్రేణి రూ.32795–రూ.62315 లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. ప్రారంభంలోనే మెట్రోపాలిటిన్‌ సిటీల్లో నెలకు రూ.60వేల వరకూ వేతనం అందుకోవచ్చు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30.09.2021 నాటికి విద్యార్హతల సర్టిఫికెట్‌ ఉండాలి. 

వయసు: 01.04.2021 నాటికి వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ప్రిలిమినరీ పరీక్ష: ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 మార్కులకు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ప్రతి విభాగంలో కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. పోస్టుల సంఖ్యకు 15 రెట్ల మందిని మెయిన్‌ రాసేందుకు అనుమతిస్తారు. 

మెయిన్‌ పరీక్ష: మెయిన్‌ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 200 మార్కులకు, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 30 మార్కులకు నిర్వహిస్తారు. ఈ రెండు టెస్టులుఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ 50 మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 50మార్కులకు, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారి డిస్క్రిప్టివ్‌ పరీక్ష పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.  

► డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో 30 మార్కులకు జరిగే పరీక్షలో.. ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పరీక్షించేలా లెటర్‌ రైటింగ్‌ పది మార్కులకు, ఎస్సే 20 మార్కులకు అడుగుతారు. 

► మెయిన్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 

► మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన స్కోర్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2021
► దరఖాస్తులకు చివరి తేది: 21.09.2021
► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌ 2021
► ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: నవంబర్‌ 2021
► వెబ్‌సైట్‌: www.newindia.co.in/portal

మరిన్ని వార్తలు