Aadhar Card: పుట్టిన బిడ్డకు ఆటోమేటిక్‌గా ‘టెంపరరీ’ ఆధార్.. ఇక చావు అప్‌డేషన్‌ కూడా!

15 Jun, 2022 18:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ).. ఇక నుంచి జననం నుంచి మరణం దాకా మొత్తం జీవిత చక్ర సమాచారాన్ని ‘ఆధార్’తో నిక్షిప్తం చేయనుంది. ఇందులో భాగంగా.. రాబోయే రోజుల్లో బిడ్డ పుట్టిన వెంటనే వాళ్ల పేరిట ఆటోమేటిక్‌గా టెంపరరీ ఆధార్ జారీ చేయనున్నట్లు సమాచారం. 

పుట్టిన వెంటనే ఆధార్‌ నెంబర్‌ పొందే చిన్నారులు.. మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో ఆ ఆధార్‌ను అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు.. త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది కేంద్రం. ఇందులో భాగంగానే.. యూఐడీఏఐ తరపున  తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

2010లో ఆధార్ మొదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. 

కారణం?
మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి.. మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్.. ఇంకా ఆటోమేటిక్‌గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వార్తలు