వీడియో: ఏం సాధించారని ఫొటోలకు ఫోజులు? సిగ్గులేదా?.. దిగ‍్గజాన్ని పక్కకు నెట్టేసిన గవర్నర్‌

19 Sep, 2022 11:05 IST|Sakshi

వైరల్‌: ఫొటోల ఫోజులకు కోసం మన నేతలు ఎంతగా తాపత్రయపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరైతే ప్రత్యేకంగా షూట్‌లతోనే కాలం గడిపేస్తుంటారు కూడా. తాజాగా డురాండ్‌ కప్‌ ఫైనల్‌ అనంతరం జరిగిన టోర్నీ బహుకరణలో జరిగిన పరిణామాలపై నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. 

ఆదివారం కోల్‌కతా సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌, ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మధ్య డురాండ్‌ కప్‌ ఫైనల్‌ జరిగింది. సునీల్‌ ఛెత్రి సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ 2-1తో విజయం సాధించింది. అయితే మ్యాచ్‌ అనంతరం టోర్నీ బహుకరణ సమయంలో ఈ ఫుట్‌బాల్‌ దిగ్గజానికి ఘోర అవమానం జరిగింది. 

టోర్నీ బహుకరణ సమయంలో ఫొటోలు తీస్తుండగా.. సునీల్‌ ఛెత్రిని పక్కకు నెట్టేసి మరీ ఫోటోలకు ఫోజు ఇచ్చారు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ లా గణేశన్‌. దీంతో ‘‘ఫుట్‌బాల్‌ దిగ్గజానికి కనీస మర్యాద ఇవ్వవా? సిగ్గులేదా?. ఏం సాధించారని ఫొజులు’’ అంటూ గవర్నర్‌ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు చేస్తున్నారు పలువురు అభిమానులు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. 

అది కాకతాళీయంగా అనుకున్నా మరో వీడియోలో.. మ్యాచ్‌ విక్టరీకి కారణమైన శివశక్తి నారాయణన్‌ను పక్కకు నెట్టేశారు హాజరైన మరో రాజకీయ నాయకుడు. దీంతో ఏం ఒరగపెట్టారని ఫొటోల కోసం అంత తాపత్రయమంటూ మండిపడుతున్నారు పలువురు నెటిన్స్‌. ఫుట్‌బాల్‌ అభిమానులే కాదు మరోవైపు ఆటగాళ్లు సైతం ఈ చర్యలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు