Kargil: సైనికులతో మోదీ దీపావళి సంబరాలు.. ‘ఇంతకంటే గొప్ప వేడుక అవసరం లేదు’

24 Oct, 2022 11:32 IST|Sakshi

కార్గిల్‌: దీపావళి పండగను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం కార్గిల్‌ చేరుకున్నారు. అక్కడ ఆర్మీ జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైనికులకు ప్రధాని స్వీట్లు పంచిపెట్టారు. కార్గిల్‌లో ఆర్మీ సిబ్బందిని ఉద్ధేశించి మోదీ ప్రసంగించారు. ఎంతో కాలంగా జవాన్లు తన కుటుంబ సభ్యులుగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. సైనికులతో కలిసి పండగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జవాన్ల త్యాగం మరువలేదని అన్నారు.  ఇంతకంటే గొప్ప దీపావళిని కోరుకోవడం లేదని తెలిపారు.

ఉగ్రవాద ముగింపే దీపావళి పండగని, దాన్ని కార్గిల్‌ సాధ్యం చేసిందన్నారు. సైనికుల త్యాగాలు దేశం గర్వించేలా ఉన్నాయన్నారు. విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు,  ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ

కాగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. దేశ సరిహిద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్‌లతో కలిసి పండగ జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కార్గిల్‌లో సైనికులతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు