డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది? | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు.. అసలు ఏం జరిగింది?

Published Mon, Oct 24 2022 11:53 AM

Suspicious Death Of Degree Student In YSR District - Sakshi

బి.కోడూరు/ సిద్దవటం(వైఎస్సార్‌ జిల్లా): మూడు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని శవమై తేలింది. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బద్వేలు నియోజకవర్గం బి.కోడూరు మండలంలోని మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి అనూష (20) బద్వేలులోని శ్రీ చైతన్య కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండేది. ఈమె మూడు రోజుల క్రితం అదృశ్యమైనట్లు బి.కోడూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. బి.కోడూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట నియోజకవర్గం సిద్దవటం మండలంలోని జంగాపల్లె గ్రామం పెన్నా నది ఒడ్డున ఆదివారం మృతదేహం లభ్యమైంది.
చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్‌ నిర్ణయం

మృతి చెందడానికి గల కారణాలపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో పెన్నా నదిలోనే పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని బాధిత కుటుంబీకులకు అప్పజెప్పారు.

బి.కోడూరు మండలం మరాటిపల్లె గ్రామానికి చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకుమార్తె అనూష. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని.. కూలీ పనులు చేస్తూ చదివించే వారు. తిరిగి వస్తుందని రేయింబవళ్లు పోలీసుస్టేషన్ల వద్ద పరిసరాల ప్రాంతాల్లో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. దీంతో వారు గుండెలవిసేలా రోదించారు. బంధువులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు. మృతిరాలి తండ్రి రామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement