వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కోలు.. ఇది ఉద్వేగభరితమైన క్షణం: ప్రధాని మోదీ

8 Aug, 2022 11:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభలో వీడ‍్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు..  యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు.

వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను  చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.
చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్‌డోజర్‌.. 

మరిన్ని వార్తలు