Puducherry: 10 రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

15 Mar, 2023 15:20 IST|Sakshi

భారత్‌లో మెల్లమెల్లగా హెచ్‌3ఎన్‌2 వైరస్ పంజా విసురుతోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్‌ ఎఫెక్ట్‌ తాజాగా పుదుచ్చేరికి తాకింది. ఈ నేపథ్యంలో పాఠశాలలను 10 రోజులు మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు.  సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా H3N2 వైరస్‌ కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారనే నివేదికల నేపథ్యంలో మార్చి 16 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని పుదేచ్చేరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇటీవల దేశంలో హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుఎంజా కేసులు అకస్మాత్తుగా పెరగుతూ ఆందోళన కలిగిస్తోంది. గత వారం ప్రారంభంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2 మార్చి 5 మధ్య భారత్‌లో 451 హెచ్‌3ఎన్‌2 వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 23 ఏళ్ల వైద్య విద్యార్థి H3N2 వైరస్‌తో మరణించగా.. గుజరాత్‌లోని వడోదరలో ఈ వైరస్‌ కారణంగా మొదటి మరణం నమోదైంది.

కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. హెచ్‌3ఎన్‌2 వైరస్ పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్‌లను మళ్లీ అనుసరించాల్సిన సమయం ఆసన్నమైందని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంట పాటించడంతో పాటు మహమ్మారి సమయంలో అనుసరించిన నియమాలను మళ్లీ పాటించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. 

చదవండి: ఇంత బలుపేంటి భయ్యా.. దెబ్బకు తిక్క కుదిరిందిగా..

మరిన్ని వార్తలు