ఆర్కే తండ్రి, ఎన్‌టీఆర్‌ మంచి స్నేహితులు

15 Oct, 2021 01:27 IST|Sakshi

 చర్ల: ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి మిత్రులు. గుంటూరు ఏసీ కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. 1983లో ఎన్‌టీ.రామా రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో సచ్చిదానందరావును స్వయంగా పిలిచారట. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను తెలుసుకున్న ఎన్టీరామారావు ఆయన కుమారుడు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పగా అందుకు నిరాకరించిన ఆర్కే తాను ప్రజల కోసం పీపుల్స్‌వార్‌లో పని చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపో యారట. అంతకు ముందు నుంచే ఆర్కే పీపుల్స్‌వార్‌ దళంలో పని చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే వరకు తల్లిదండ్రులకు తెలియ దు. తర్వాత కొన్ని రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి హరగోపాల్‌ నుంచి రామకృష్ణగా, ఆర్‌కేగా పేరు మార్చుకున్నాడు. అనంతరం పీపుల్స్‌వార్‌లో ఉన్నత స్థాయికి చేరాడు.

తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్షలు
1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి    పడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాలను ఎదిరించాడు. ఈ క్రమంలో ఆర్‌కే కొందరిని హతమార్చాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికి అప్పుడు జనం భయపడ్డారు. అప్పట్లో మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. దీంతో జనం పీపుల్స్‌ వార్‌పై ఆసక్తి చూపారు. ఈ క్రమంలో చాలా మంది ప్రజలు వారి బాధలను నేరుగా పీపుల్స్‌వార్‌ సభ్యులకే చెప్పుకునేవారు. ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్‌ మావోయిస్టు పార్టీలో విలీనం కావడంతో ఆర్కే జాతీయ నాయకుడ య్యాడు. ఉద్యమంలో ఉండగానే విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువునే ఆర్కే వివాహం చేసుకున్నాడు.    

మరిన్ని వార్తలు